*కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్ తుమ్మల మనోజ్పై పీడీ యాక్ట్ – అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు*
ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కరుడుగట్టిన నేరస్థులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. విద్యా సంస్థల వద్ద గంజాయి విక్రయాలు జరుపుతూ యువతను మత్తులో దించడమే కాకుండా దోపిడీ, గొలుసు చోరీలు చేస్తున్న వారికి గంజాయి సప్లై చేస్తున్న కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్పై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు.
విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే తుమ్మల మనోజ్ అలియాస్ మన (28)పై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 28 సంవత్సరాల మనోజ్పై వివిధ సెక్షన్ల కింద పలు జిల్లాల్లో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. తన చర్యలతో పోలీసులకు సవాల్ విసిరి శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న మనోజ్ను తక్షణం అరెస్ట్ చేసి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కటకటాల వెనుక ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
మనోజ్ నేరచరిత్ర ఇదిగో : సత్యనారాయణపురం నాగేశ్వరరావు పంతులు రోడ్డుకు చెందిన తుమ్మల మనోజ్పై 2011లో తొలిసారిగా వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదైంది. ఆ తర్వాత 2012లో మరో కేసు నమోదు కాగా అప్పటి నుంచి వరుసగా గంజాయి విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు దొరికిపోయాడు.
నందిగామ, జగ్గయ్యపేట, భవానీపురం, కృష్ణలంక, పటమట, వన్టౌన్, కంచికచర్ల, సత్యనారాయణపురం, మాచవరం, పట్టాభిపురం, నూజివీడు టౌన్, విశాఖపట్నం వన్టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిలో దొంగతనం, గంజాయి విక్రయం, దోపిడీ కేసులు ఉన్నాయి. 2015లో ఇతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కాగా న్యాయస్థానంలో ఆ కేసు కొట్టివేశారు
2011 నుంచి ఇప్పటి వరకు మనోజ్పై వివిధ సెక్షన్ల కింద మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 కేసుల్లో శిక్షలు పడ్డాయి. మూడు కేసులు విచారణలో ఉన్నాయి. 8 కేసులు రాజీ చేసుకోగా 6 కేసులను కొట్టివేశారు. ఇతనిపై వరుస కేసులు ఉండడంతో 2014లో ఇతడిపై రౌడీషీట్ తెరిచి పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. దీంతో పలు కేసుల్లో గంజాయి విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు మనోజ్ తీవ్ర విఘాతం కలిగిస్తుండడంతో అతడిపై పీడీ యాక్ట్ పెడుతూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.