Site icon PRASHNA AYUDHAM

మాటలు ఎక్కువ – చర్యలు తక్కువ: సీఎం రేవంత్‌పై హరీష్ రావు విమర్శలు

Screenshot 2025 10 05 14 25 44 37 40deb401b9ffe8e1df2f1cc5ba480b12

ఎల్లారెడ్డి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం):

మాజీ మంత్రి టి. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరదల కారణంగా రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన హరీష్ రావు మాట్లాడుతూ, “సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. అధికారుల నివేదిక ప్రకారం ₹344 కోట్ల నష్టం జరిగినప్పటికీ, రైతుల చేతికి ఇప్పటి వరకు ఎటువంటి సహాయం చేరలేదు,” అని తెలిపారు.

అలాగే “సీఎం రేవంత్ రెడ్డి కేవలం దెబ్బతిన్న వంతెనను చూసి వెళ్లిపోయారు. కానీ రైతుల పొలాలు, పాడైన పంటలు, చెరువుల నష్టాన్ని మాత్రం చూడలేదు. రహదారులు, విద్యుత్ లైన్లు, కాలువలు దెబ్బతిన్నా ఇప్పటికీ పునరుద్ధరణ పనులు ప్రారంభం కాలేదు.”

హరీష్ రావు మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని దెబ్బతిన్న వంతెన కారణంగా ఎల్లారెడ్డి–కామారెడ్డి మధ్య బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్కపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “సీతక్క ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నప్పటికీ, వరద ప్రభావిత ప్రాంతాలను ఇప్పటివరకు సందర్శించలేదు. రైతుల పరిస్థితిని తెలుసుకోవడం, సహాయం చేయడం పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది,” అని హరీష్ రావు విమర్శించారు.

“సీఎం పదిహేనురోజుల్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పి నెల గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం మాటల్లోనే ఉందే గాని, పనిలో లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.

వరద ప్రభావిత రైతులకు ఎకరాకు ₹25,000 పరిహారం ఇవ్వాలని, అలాగే పొచారం ప్రాజెక్టు కాలువలను తక్షణమే మరమ్మతు చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్శనలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సురేందర్ జాజాల, గంప గోవర్ధన్, మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version