ఉజ్వల పథకంలో కొత్తగా 284 గ్యాస్ కనెక్షన్లు మంజూరు
అర్హులైన లబ్ధిదారులు సమీప డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 29
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన బుధవారం ఆయన ఛాంబర్లో జిల్లా ఉజ్వల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 284 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో IOCL–169, BPCL–33, HPCL–82 కనెక్షన్లు ఉన్నాయని వివరించారు.
అర్హత గల లబ్ధిదారులు తమ ప్రాంతంలోని ఎల్పిజీ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులు సమర్పించుటకు తుది గడువు లేదని కలెక్టర్ తెలిపారు.
రేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబాలకే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఉజ్వల పథకం ద్వారా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్, మొదటి రీఫిల్, గ్యాస్ స్టవ్, సురక్ష పైపు, రెగ్యులేటర్, ఇన్స్టాలేషన్ వంటి అన్ని సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా అందజేయబడతాయని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి. విక్టర్, డీసీఎస్ఓ వెంకటేశ్వరరావు, జిల్లా నోడల్ ఆఫీసర్ & సేల్స్ ఆఫీసర్ (BPCL) శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.