భోగారం బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ మనూ చౌదరి
విద్యార్థినుల విద్యా ప్రగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్నా ఆయుధం అక్టోబర్ 23
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరి, ఐఏఎస్, గురువారం రోజు తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ (వెస్ట్సైడ్, భోగారం)ను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మనూ చౌదరి పాఠశాల విద్యార్థినులతో నేరుగా మాట్లాడి, వారి విద్యా ప్రగతి, శిక్షణా కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు క్రమశిక్షణ, కృషి, ధైర్యంతో చదువుకుని సమాజంలో మార్పు తీసుకురాగల శక్తిగా ఎదగాలని ఆయన ప్రోత్సహించారు.
అభివృద్ధిపై సమీక్ష:
కలెక్టర్ పాఠశాల మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్, భోజనశాల తదితర వసతులను స్వయంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీఓ, నాగారం మున్సిపల్ కమిషనర్, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు.
చివరగా విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన కలెక్టర్ మనూ చౌదరి, “ప్రతి విద్యార్థికి సమాన విద్యా అవకాశాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచే దిశగా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.