అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ – 15 చోరీలు భేదం చేసిన కామారెడ్డి పోలీసులు

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ – 15 చోరీలు భేదం చేసిన కామారెడ్డి పోలీసులు

నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కూడా దోపిడీలు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడింపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) నవంబర్ 8 

కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం పై జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పోలీసు అధికారి రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.

గత నెల 31న చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో పాత జాతీయ రహదారి పక్కన గల ఆటో ఎలక్ట్రికల్ రేకుల షెడ్డులోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి కారు, ఇతర వస్తువులను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

తాజాగా కామారెడ్డి పట్టణ పరిధిలో వరుస చోరీలు జరుగుతుండటంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శనివారం నర్సన్నపల్లి కమాన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను వలపన్ని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వారు దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్, భిక్కనూరు పరిధిలో జరిగిన 15 చోరీలలో పాలుపంచుకున్నట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు.

ఇతర జిల్లాల్లో కూడా చోరీలు,

నిందితులు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు. నిర్మల్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు జరిపారని తెలిపారు. ఈ ముఠా సుమారుగా కిలోన్నర బంగారం మరియు ఇతర ఆభరణాలను వివిధ జిల్లాల్లో దోచుకున్నట్లు వెల్లడించారు.

అరెస్టు అయిన వారిలో నిర్మల్ జిల్లా బాంని గ్రామానికి చెందిన షేక్ రఫీక్, షేక్ ఖాదర్, షేక్ ఖయ్యూమ్, షేక్ అజ్జు మరియు మహబూబాబాద్ పట్టణానికి చెందిన బండారి అశోక్ ఉన్నారని తెలిపారు. వీరిపై పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

అశోక్‌పై 22 కేసులు

షేక్ అజ్జుపై 9 కేసులు

ఖాదర్‌పై 17 కేసులు

ఖయ్యూమ్‌పై 18 కేసులు

రఫీక్‌పై 1 కేసు ఉన్నట్లు ఎస్పీ వివరించారు.

వస్తువులు స్వాధీనం,

నిందితుల వద్ద నుంచి పోలీసులు ఒక కారు, మూడు బైకులు, మూడు ఇనుపరాడ్లు, ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్ టైప్ వెపన్, డీజిల్ క్యాన్, వెహికిల్ డయాగ్నస్టిక్ స్కానర్ స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను రిమాండ్‌కు తరలించిన తర్వాత కస్టడీలో తీసుకుని మరిన్ని చోరీల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ,

ఈ కేసు విచారణలో చురుకుగా పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్, కామారెడ్డి రూరల్ సీఐలు శ్రీనివాస్, రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment