*వైద్యం అందించక మృతికి కారణమయ్యారంటూ బంధువుల ఆందోళన*
*మంజీరా హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్*
*డీఎస్పీ సత్తయ్యగౌడ్ చొరవతో శాంతించిన బంధువులు*
*వైద్యుల నిర్లక్ష్యంపై కేసు నమోదు చేయాలి.*
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): నడుచుకుంటూ హాస్పిటల్కు వచ్చిన వ్యక్తికి సరైన వైద్యం అందించకపోవడంతో ఆయన మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మంగళవారం సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మంజీరా హాస్పిటల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. విద్యానగర్కు చెందిన వెంకటేశ్ గౌడ్ (42) హాస్పిటల్కు వచ్చినప్పటికీ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ యాజమాన్యం మరియు డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలను మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ సత్తయ్య గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వెంకటేశ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపించారు. బాధ్యులైన వైద్యులపై కేసు నమోదు చేయడంతో పాటు హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.