నకిలీ నోట్ల ముఠాపై ఉక్కుపాదం
ఇంకా ఇద్దరిపై పీడీ యాక్ట్
ఉత్తర్వులు జైల్లోనే అందజేసిన అధికారులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 2
కామారెడ్డి : అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాను అణచివేసేందుకు జిల్లాలో పోలీసులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిపై పీడీ యాక్ట్ అమలు చేసిన పోలీసులు, తాజాగా మంగళవారం ముఠాలో కీలక పాత్ర పోషించిన మరొక ఇద్దరు నిందితులపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిందితులకు జైలులోనే ఉత్తర్వులు అందజేసినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని వైన్స్ షాపుల్లో నకిలీ రూ.500 నోట్లు వినియోగించిన కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్కు చెందిన లఖన్ కుమార్ దుబే, యూపీకి చెందిన సత్యదేవ్ యాదవ్, పశ్చిమ బెంగాల్కు చెందిన సౌరవ్డేల్పై పీడీ యాక్ట్ అమలు చేసిన పోలీసులు — మంగళవారం యూపీకి చెందిన దివాకర్ చౌదరి అలియాస్ బ్రిజేష్ కుమార్ గుప్తా, పశ్చిమ బెంగాల్కు చెందిన హరి నారాయణ భగత్ అలియాస్ సంజయ్లపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులకు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సీఐ నరహరి, హెడ్ కానిస్టేబుల్ వీఎల్ నర్సింలు అందజేశారు.
నకిలీ కరెన్సీ చలామణి ప్రజల్లో భయం, ఆర్థిక అస్థిరత సృష్టిస్తుందని, ఇటువంటి నేరగాళ్లపై పీడీ యాక్ట్ ప్రభావవంతమని ఎస్పీ పేర్కొన్నారు. ఏడాది పాటు బెయిల్ లేకుండా జైల్లోనే నిర్బంధంలో ఉంచే వీలుండటంతో నేరాలను అరికట్టడంలో ఇది కీలకంగా మారుతోందని చెప్పారు. నకిలీ కరెన్సీ నేరాలను మూలం వరకు నిర్మూలించేందుకు ఉక్కుపాదంతో కొనసాగుతామని ఎస్పీ స్పష్టం చేశారు.