ఫర్టిలైజర్ షాప్ను ఆకస్మిక తనిఖీ చేసిన_జిల్లా కలెక్టర్
అధిక ధరలు, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 30:
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మౌనిక ఫర్టిలైజర్ షాప్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాప్లోని ఎరువుల నిల్వలు, అమ్మకాలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ధరల పట్టికలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు అమ్మకాలు, బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా చూడాలని, కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని షాప్ నిర్వాహకులను ఆదేశించారు. షాప్ ముందు ఎరువుల నిల్వల వివరాలు, ధరల పట్టికలు, జిల్లా–రాష్ట్ర టోల్ఫ్రీ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, తహసిల్దార్ రేణుక, ఏఈవో రాజలింగం, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.