ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక…

రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలి- కేటీఆర్

ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం పైన కేటీఆర్ ఆగ్రహం.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.

మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్ కు పైసలు లేవా అని ప్రశ్న. 

లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం..

వానాకాలం సీజన్ పూర్తవుతున్న రైతుభరోసా ఊసేలేదు.

మీ ముడుపుల మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటయ్? రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా?

ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి…రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టు.

రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక.

IMG 20241004 WA0045

రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులు పండించే ప్రతి క్వింటాలు ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలోనూ దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్, ఈ వర్షా కాలానికి సంబంధించి రైతు భరోసా సాయం పైన తేల్చకుంట కప్పదాటు వైఖరి అనుసరించిన ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. అదే విధంగా వానాకాలం సీజన్ పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా ఊసే ఎత్తటం లేదని ప్రశ్నించారు. వెంటనే దొడ్డు వడ్లకు బోనస్ తో పాటు రైతు భరోసా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా రైతులు పండించే ధాన్యం ప్రతి క్వింటాలుకు రూ. 500 అదనంగా బోనస్ ఇస్తామని ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. గత సీజన్ లో రైతులకు బోనస్ ను చెల్లించకుండా వారిని ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ సీజన్ లో కూడా ఇప్పటి వరకు దొడ్డు వడ్లకు బోనస్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవటంతో రైతులు అయోమయంలో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షలోనైనా ఈ అంశంపై స్పందిస్తారని ఆశించినప్పటికీ దాని గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం చూసి రైతులంతా ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు రైతులు పండించిన ధాన్యం మొత్తానికి క్వింటాకు రూ. 500 బోనస్ అంటూ మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పటం జరిగింది. దానికి అనుగుణంగా ఈ సీజన్ రైతులు పండించిన ధాన్యం మొత్తానికి క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లించాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత సీజన్ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ప్రకటిస్తామంటే అది మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేనని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా రైతులు పండించేవి దొడ్డు వడ్లేనన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు అని చెప్పారు. సన్నలు, దొడ్డు వడ్లు రెండింటికి బోనస్ ఇస్తామన్న మీ మాటలు నమ్మే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారన్న విషయాన్ని మార్చిపోవద్దని కేటీఆర్ సూచించారు. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ సన్నాసి నొక్కులు నొక్కటమంటే అది మూమ్మటికీ రైతులను నిలువునా మోసం చేసే కుట్రనేనని అన్నారు. వెంటనే రైతులకు బోనస్ ను చెల్లించాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం తప్పదని హెచ్చరించారు.  

 రైతు భరోసా ఊసేదీ?.

వానాకాలం సీజన్ ఫూర్తయినప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా సంగతి తేల్చటం లేదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరిట ఎకరాకు రూ. 7500 ఇస్తామంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరే మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గత సీజన్ లో రైతులకు రైతుబంధు పైసలు మాత్రమే వేశారు. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు అసలు రైతు భరోసా సంగతే తేల్చటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నాట్లు వేసే నాడు వేయాల్సిన పెట్టుబడి సాయాన్ని పంట చేతికొచ్చే వరకు కూడా ఇవ్వకపోవటమంటే రైతు పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటూ తహతహలాడుతున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతు భరోసా వేసేందుకు పైసలు లేవా అని ప్రశ్నించారు. మూసీ పేరుతో చేసే అవినీతి ఆలోచనలను మానేసి…రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. రైతును రాజును చేయాలన్న గట్టి సంకల్పంతో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు పేరిట రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు పథకానికి ప్రశంసలు అందాయన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ఏటా రూ. 10 వేలు ముష్టి వేస్తున్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 15 వేలు ఇస్తామంటూ మీరు చేసిన ప్రకటనలు విని రైతులు పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశపడ్డారన్నారు. రూ. 15 వేల సంగతేమో గానీ గతంలో ఇచ్చిన ఎకరాకు రూ. 10 వేలు కూడా దక్కని పరిస్థితి తీసుకొచ్చి రైతును గోస పెడుతున్నారు. గత సీజన్ లో కూడా రైతుబంధు విషయంలో తీవ్ర గందరగోళం సృష్టించారు. ఈ సీజన్ దాదాపు పూర్తయిపోతున్న సరే ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు. రైతు భరోసా ఇస్తారో లేదా ప్రభుత్వం స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత సీజన్ లో బాకీ ఉన్న డబ్బులను కలుపుకొని వెంటనే రైతుల ఖాతాలో ఈ సారికి మొత్తం ఎకరాకు పది వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు కచ్చితంగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. 

20 లక్షల మందికి రైతులకు నయా పైసా రాలే.

వందశాతం రుణమాఫీ అయ్యిందంటూ విర్రవీగిన ముఖ్యమంత్రి బండారం వ్యవసాయ మంత్రి ప్రకటనతో బట్టబయలైందని కేటీఆర్ అన్నారు. 20 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాపీ జరగలేదని స్వయంగా వ్యవసాయ మంత్రే ప్రకటన చేశాడంటే ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని తేలిపోయింది. డిసెంబర్ 9 రోజే ఏకకాలంలో రూ. 2లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి 10 నెలలైనా 20 లక్షల మంది రైతులకు నయా పైసా రాలేదంటే రైతులను నయవంచన చేయడం కాకపోతే ఏంటీ అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారమే…20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటే అనధికార లెక్కల ప్రకారం ఇంకా ఎంతమంది రైతులు ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతులకు చేయాల్సిన రుణమాఫీ పక్కన పెట్టి మూసీ పేరుతో వేలకోట్లు దోపీడి చేయాలనుకుంటున్న ఈ రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభమని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోలేని శాపంగా మారిందన్నారు. వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now