దేశ జనాభాలో అత్యధిక ఓబీసీలు తమ న్యాయమైన హక్కుల సాధనకు పోరాడుతూ రాజ్యాధికారం చేపట్టే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఉద్ఘాటించారు.మండల్ దివస్ ఉత్సవాలలో భాగంగా ఆలిండియా ఓబీసీ విద్యార్థి సంఘం(AIOBCSA) ఆధ్వర్యంలో ఢిల్లీలోని కానిట్యూషనల్ క్లబ్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సబ్బండ వర్గాలను ఏకోన్ముఖులను చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారన్నారు.తెలంగాణ అసెంబ్లీ తొలినాళ్లలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,మహిళా రిజర్వేషన్స్ పెంపుదలకు,అమలునకు ఏకగ్రీవంగా తీర్మానించడాన్ని గుర్తు చేశారు.ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ఏంఆర్పీఏస్ నాయకులు మంద కృష్ణకు కేసీఆర్ మొదటి నుంచి సంపూర్ణ మద్దతునిచ్చారని ఎంపీ రవిచంద్ర వివరించారు.ఓబీసీల న్యాయమైన డిమాండ్స్ విషయమై ఢిల్లీలో సుదీర్ఘ చర్చ జరిపి పాలకుల దృష్టికి తేవడం,దేశ ప్రజలకు వివరించడం శుభ పరిణామం అన్నారు.దేశంలో కులగణనను చేపట్టి పూర్తి చేయడం ద్వారానే మహిళా రిజర్వేషన్స్ అమలు సాధ్యమవుతుందన్నారు.కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని,చట్టసభలలో రిజర్వేషన్స్ కల్పించాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.తమ న్యాయమైన హక్కుల సాధనకు ఓబీసీలు జరిపే ఉద్యమాలకు తమ పార్టీ అండగా ఉంటుందని, సంపూర్ణ మద్దతునిస్తుందని ఆయన హామీనిచ్చారు.ఈ సందర్భంగా ఎంపీలు రవిచంద్ర,ఆర్.కృష్ణయ్య,మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తదితర ప్రముఖులు గోడ పత్రికను ఆవిష్కరించారు,”జై ఓబీసీ జైజై ఓబీసీ,జై భారత్”అంటూ ముక్తకంఠంతో నినదించారు.
Latest News
