నీట్ అవసరం ఇక ఉండదా?
*12వ తరగతి కోసం ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన*
*9, 10, 11 తరగతుల మార్కులూ కలిపే విధానం*
*అన్ని బోర్డుల్లోనూ ఒకే తరహా మార్కుల వ్యవస్థ*
*కేంద్ర విద్యా శాఖకు పరఖ్ ప్రతిపాదనలు*
ప్రశ్నాయుధం న్యూస్, ఆగస్టు 10,
న్యూఢిల్లీ:
దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్కుల వ్యవస్థ ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎన్సీఈఆర్టీకి చెందిన పరఖ్ (పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవెలప్మెంట్) అన్ని కేంద్ర, రాష్ర్టాల విద్యా బోర్డులను అధ్యయనం చేసి కేంద్ర విద్యా శాఖకు పలు ప్రతిపాదనలు చేసింది. పరీక్షలు, మార్కుల విధానాన్ని అన్ని బోర్డుల పరిధిలో ఒకే తరహాలో మార్చాలని సూచించింది. 12వ తరగతి ఫలితాల్లో 9, 10, 11వ తరగతి ఫలితాలనూ చేర్చడం ద్వారా విద్యార్థుల ప్రతిభను సరిగ్గా ముల్యాంకనం చేయవచ్చని పేర్కొన్నది. ఇందుకుగానూ 12వ తరగతిలో 9వ తరగతి మార్కులపై 15 శాతం, 10వ తరగతిపై 20 శాతం. 11వ తరగతిపై 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని, మిగతా 40 శాతాన్ని 12 తరగతి మార్కుల వెయిటేజీ ఉండాలని ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ఇక నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అవసరం ఉండకపోవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు.
*ఏ బోర్డు అయినా ఒకే వ్యవస్థ*
రాష్ర్టాలకు ఆయా రాష్ర్టాలు ఏర్పాటు చేసుకున్న విద్యా బోర్డులతో పాటు జాతీయ స్థాయిలో ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, ఎన్ఐఓఎస్ వంటి బోర్డులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల తయారీ, మార్కుల కేటాయింపు వంటివి ఒక్కో బోర్డులో ఒక్క రకంగా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ బోర్డులకు చెందిన దాదాపు 18 వేల ప్రశ్నాపత్నాలను పరఖ్ బృందం అధ్యయనం చేసింది. అన్ని బోర్డుల పరిధిలో ఒకే రకమైన విధానాన్ని తీసుకురావాలని, తద్వారా విద్యార్థులు ఒక బోర్డు పరిధి నుంచి ఇంకో బోర్డు పరిధిలోకి మారడం సులువు అవుతుందని ప్రతిపాదించింది.