ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నది ఆయన అధికారంలో ఉన్న కాలంలో పదే పదే రుజువైంది.

 

ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు.

 పైకి ఏపీలో హింసాకాండ, తెలుగుదేశం కూటమి సర్కార్ వైసీపీ నేతలు, కార్యకర్తలపై దమనకాండకు పాల్పడుతోంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 అదే సమయంలో హస్తిన ధర్నా అంటూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. 

 

IMG 20240810 WA0041

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిందనీ, తనకు ఏపీలో భద్రత లేదనీ ఆరోపిస్తూ పదే పదే బెంగళూరుకు వెడుతున్నారు.అయితే భద్రత అన్నది సాకు మాత్రమేననీ, ఆయన బెంగళూరు వెళ్లేది ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తో భేటీలకేననీ తేలిపోయింది. జగన్ తాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా అవసం ఉన్నా లేకపోయినా.. కేంద్రంలోని మోడీ సర్కార్ కు మద్దతు పలికారు.బీజేపీ అగ్రనేతల అడుగులకు మడుగులొత్తారు. ఇదంతా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల నుంచి రక్షణ కోసమేనని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని వేటినీ ఖాతరు చేయలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. అలా ఉన్నా కూడా జగన్ బీజేపీతో అంటకాగుతానంటే బీజేపీకి ఏం అభ్యంతరం ఉండదు కానీ, గతంలోలా ఆయనను అన్ని విషయాలలోనూ వెనకేసుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయం ఇప్పటికే స్పష్టమైంది కూడా. రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య చూపి బీజేపీ తనకు రక్షణ కవచంలా నిలబడేలా చేసుకోవాలని జగన్ భావించారు. ఇందు కోసం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రెండు సార్లు కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా వద్దకు రాయబారానికి పంపారు. అయితే ఆ రాయబారం ఫలించినట్లు కనబడదు. మరో వైపు అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం సీరియస్ అయ్యింది. అలాగే వివేకా హత్య కేసు దర్యాప్తు, విచారణ కూడా వేగం పుంజుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఏపీ హోంమంత్రి అనితతో భేటీ కావడంతో వివేకా హత్య కేసు విచారణ జోరందుకుంటుందన్న భావన వ్యక్తం అవుతోంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకి వైసీపి బేషరతుగా మద్దతు ఇస్తూనే ఉంది. వైసీపి, బీజేపీల మద్య ఎటువంటి పొత్తు లేకపోయినా.. గత 5 ఏళ్ళుగా మోడీ జగన్‌ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులను యధాతధ స్థితిలో ఉంచేందుకు జగన్ ప్రదర్శించిన విధేయత కారణమైదనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయ్యింది. ఇప్పుడు కూడా వైసీపి మద్దతు ఇస్తే మోడీ ప్రభుత్వం కాదనదు, సంతోషంగా స్వీకరిస్తుంది.. కానీ గతంలోలా జగన్ తో క్విడ్ ప్రోకో బంధం కొనసాగించే పరిస్థితి మాత్రం లేదు. జగన్ కేసులను యధాతథ స్థితిలో ఉండే విధంగా కేంద్రం నుంచి సహకారం అందదు. ఇటీవల తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసి ట్రయల్ వేగవంతం చేయాలని ఆదేశించడమే ఇందుకు నిదర్శనం.  దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నారు. అందుకే తన ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ మిత్ర పక్ష నేతలను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు కొందరు ధర్నాకు వచ్చి జగన్ కు సంఘీభావం కూడా తెలిపారు. అందుకు ప్రతిగా వైసీపీ ఇప్పుడు లోక్ సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా తాను కాంగ్రెస్ గూటి పక్షినేనని చాటింది. తద్వారా నేరుగా బీజేపీపై జగన్ యుద్ధం ప్రకటించారనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, స్వయానా తనకు సోదరి అయిన షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ పై సంధిస్తున్న విమర్శల బాణాలకు అడ్డుకట్ట వేయాలన్న షరతుపై కాంగ్రెస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాజకీయ వర్గాలు అంటున్నారు. ఆ విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానంతో బేరసారాలు సాగించేందుకే జగన్‌ పదేపదే బెంగళూరు పర్యటిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే తాను బీజేపీని వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తానని చాటేందుకే లోక్ సభలో జగన్‌ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని అంటున్నారు. లోక్‌సభలో మోడీ ప్రభుత్వాన్ని వైసీపి వ్యతిరేకించిన మర్నాడే అంటే శుక్రవారం(ఆగస్టు 9) జగన్‌ మళ్ళీ బెంగళూరు బయలు దేశారు. ఈ సారి కూడా ఆయన డీకేతో భేటీ అవుతారు. ఈ భేటీలో షర్మిల దూకుడుకు ముకు తాడు వేసే విషయంలోనూ, అలాగే కాంగ్రెస్, జగన్ ల పొత్తుకు సంబంధించి ఒప్పందం ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Join WhatsApp

Join Now