తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచండి
ప్రతిపాదిత బ్రేక్ ఫాస్ట్ స్కీం కు సహకారం అందించండి
కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో చర్చించిన మంత్రి సీతక్క
సీతక్క ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసిన కేంద్ర మంత్రి
సీతక్కను శాలువాతో సత్కరించిన అన్నపూర్ణాదేవి
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన సీతక్క
ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సోమవారం నాడు భేటీ అయ్యారు. అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కోసం అల్పాహర పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు. టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎం ఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కాంతి వెస్లీతో కలిసి, మంత్రి సీతక్క కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించి గంట పాటు చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలతో పాటు.. అంగన్ వాడీ చిన్నారులకు అల్పహార పథక అవసరాన్ని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 AWCలు పనిచేస్తుండగా..ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ (ఐసిడిఎస్) ద్వారా మహిళలు, పిల్లలకు సంపూర్ణ పోషణను అమలు చేయడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి సీతక్క. ప్రస్తుతం 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల 8.6 లక్షల మంది పిల్లలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం ద్వారా పూర్తి వేడి భోజనంతో పాటు గుడ్డు, స్నాక్స్ కు చిన్నారులకు అందచేస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల కరోనా తర్వాత పలువురు చిన్నారులు పోషకార లోపంతో భాదపడుతున్నారు. అందుకే అంగన్వాడీ చిన్నారుల పోషణను మెరుగు పరిచేందుకు అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తే చిన్నారులు ప్రతిరోజూ అదనపు పోషకాహారం అందుకుంటారు.దీంతో పాటు చిన్నారులు ప్రీ-స్కూళ్లకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సహిస్తుంది. ఈ స్కీం వల్ల 8.6 లక్షల మంది అంగన్ వాడీ చిన్నారులు ప్రయోజనం పొందుతారు. ఒక్కో చిన్నారికి రోజుకు అల్పాహారం కోసం రూ. 8 ఖర్చు అయ్యే అవకాశాలు న్నాయి. అంటే ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ. 206 కోట్లు ఖర్చు అవుతాయి.
ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో బ్రెక్ ఫాస్ట్ స్కీం అమలు కోసం కేంద్ర సహకారాన్ని కోరారు మంత్రి సీతక్క. చిన్నారుల పోషకాహార అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రతిపాదనను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ప్రశసించారు. చిన్నారులకు అల్పాహారాన్ని అందించే ఆలోచన చేయడం గొప్ప విషయమని అభినందించారు. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీంకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిధులు మంజూరు కు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో తాను పర్యటించి..మహిళా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.