వెదురు సాగు చేసే రైతుల ఇంట సిరుల పంట : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
వెదురు సాగు చేయడం వల్ల రైతుల ఇంట సిరుల పంట పండినట్టేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం మినీ సమావేశ మందిరంలో ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చుండ్రుగొండ, ములకలపల్లి గుండాల మండలాల ఏపిఎం లు, ఏపీవోలు, సీసీలు, ఎఫ్ పి సీలు, వివో ఏసీలు మరియు అటవీ శాఖ సిబ్బంది కి వెదురు పెంపకం పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6 లక్షల 18 వేల వెదురు సాగు లక్ష్యం ని కచ్చితంగా చేరుకోవాలని అందుకుగాను ఇండస్ట్రీస్ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారు మన జిల్లాలో వెదురు సాగు చేయడానికి సులభమైన పద్ధతులు, వివిధ రకాల వెదురు సాగు, వెదురు సాగు వల్ల ఉపయోగాలు, వెదురు ఉత్పత్తులు తదితర వాటి మీద రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో చండ్రుగొండ, ములకలపల్లి మరియు గుండాల మండలాలలోని భూములు వెదురు సాగుకు ఎంతో అనుకూలమని, అదేవిధంగా సాగుకు అవసరమైన నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎవరైతే ఐదు ఎకరాల వ్యవసాయం చేస్తూ బోరు సౌకర్యం వున్నఅటువంటి రైతులు ఒక ఎకరం వెదురు సాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పెద్ద రైతులు వారికున్న భూముల్లో ఒక ఎకరం చిన్న రైతులు అర ఎకరం లోనైనా వెదురు సాగు చేపట్టాలని దాని ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి చెందుతారు అన్నారు. మునగ మరియు వెదురు సాగు అన్ని సమస్యలకు పరిష్కారమని కలెక్టర్ అన్నారు. మునగ సాగు ద్వారా స్వల్ప కాలంలోనే ఆదాయం సమకూరుతుందని, వెదురు సాగు ద్వారా ఎఫ్ డి లా ఒక్కసారి పెట్టుబడితో నిరంతర ఆదాయం చేకూరుతుందన్నారు. వెదురు ను ఉపయోగించి కేవలం ఫ్లోరింగ్ మరియు ప్యానలింగ్ మాత్రమే కాకుండా ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు వినియోగంతో ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుందని, దానికి బదులు వెదురు గుళికలు వినియోగించడం జరుగుతుంది అన్నారు. తద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీగా వెదురు గుళికలు అవసరం పడుతున్నాయని, ఈ అవసరమే వెదురు సాగును లాభాల బాటలో నడిపించనుంది అని తెలిపారు. అంతేకాకుండా నంద్యాలలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ వారు వెదురు కొనుటకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.మన జిల్లాలో జామాయిల్ సాగుకు సమానంగా వెదురు సాగు చేపట్టాలని, ఆ దిశగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఆదివాసీల అభివృద్ధికి వెదురు సాగు ఒక్కటే మార్గమని వెదురు సాగు ద్వారా ఆదివాసీల సాంప్రదాయ వస్తువుల తయారీ చేపట్టవచ్చని, అదేవిధంగా పోడు వ్యవసాయంలో వెదురు సాగు చేపట్టేలా అటవీశాఖ అధికారులు ఆదివాసీలను ప్రోత్సహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ రమ్య, డాక్టర్ శ్రీకాంత్, ఆపరేషన్ మేనేజర్లు అమృత, అక్షయ్, టెక్నికల్ మేనేజర్ కుసుమకుమారి, మూడు మండలాల అవి శాఖ అధికారులు, ఏ పీ ఎం లు, ఏపీవోలు, సీసీలు, ఎఫ్ పి సి లు, వివో ఏసీలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now