*నా ఫొటోలు మార్ఫింగ్ చేశారు..*
*ఇక వదిలేది లేదంటూ మంత్రి మాస్ వార్నింగ్..*
హైదరాబాద్: సోషల్ మీడియాలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసి మానసిక క్షోభకు గురి చేశారంటూ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్నీ కొంతమంది దుర్మార్గులు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వల్ల తాను కుమిలిపోయానని, దాన్ని కట్టడించడం చాలా అవసరమని అన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, దాంతో తాను డీ మోరల్ అయినట్లు సీతక్క వెల్లడించారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారానికి వాడుతోందని, అది కుటుంబాలను బజారుకీడుస్తోందని మండిపడ్డారు.
సోషల్ మీడియా దుష్ప్రచారం గురించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం తామందరికీ రిలీఫ్ అనిపించిందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు రాజకీయాల్లో ఎదగడమే చాలా కష్టమని, అలాంటిది తాము ఈస్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహించారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్కు వాడుకున్న తానూ అందరిలాగానే ఇబ్బందులకు గురైనట్లు చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఎంతో సర్వీస్ చేశానని, దానిపైనా సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శించారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
బాడీ షేమింగ్, ఫొటోలు మార్ఫింగ్, అనని మాటలు అన్నట్లుగా చూపిస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారం చేపటిన నాటి నుంచి మాపై ఈ దాడులు మరీ ఎక్కువైపోయాయంటూ ఆరోపించారు. అన్నాచెల్లెళ్లు చేతిలో చెయ్యి వేసుకున్నా మరోరకంగా చూపుతున్నారని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాను మంచికి వాడాలే తప్ప చెడుకు కాదంటూ హితవు పలికారు. అబద్ధాలపైనే బీఆర్ఎస్ నడుస్తోందని, ఏ రోజుకైనా నిజమే గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా బురద చల్లుతున్నారని, కడుక్కోవడం తమ వంతు అవుతోందంటూ మంత్రి సీతక్క చెప్పారు..