*అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు…!*
*తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు…!*
హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది.ఆపరిచితుడి నుంచి దారినపోయే దానయ్య వరకు ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయవచ్చునని తేల్చి చెప్పింది. అక్రమ నిర్మాణాల బాధితుడే ఫిర్యాదు చేయాలని ఏమీ లేదని స్పష్టంచేసింది. బయట వ్యక్తి అంటే నేరుగా బాధితుడు కాని వ్యక్తి ఫిర్యాదు చేశాక అధికారుల నుంచి స్పందన లేకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది.
ఈ మేరకు జస్టిస్ టీ వినోద్కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. హైదరాబాద్, బేగంపేట బీఎస్ మక్తాలో 400 చదరపు గజాల్లో అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ చేగూరి అనిత ఆండాళ్లు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్, ఆమె కొడుకు 200 గజాల చొప్పున స్థలాలను కొనుగోలు చేసి విడివిడిగా రెండంతస్థుల నిర్మాణాలకు అనుమతి తీసుకుని ఆ తర్వాత 400 చదరపు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 అంతస్థుల నిర్మాణాలకు అనుమతులను సవరించారని న్యాయవాది చెప్పారు.
భవన పటిష్టత, వాస్తు వంటి పేరుతో అయిదో అంతస్థు నిర్మించారని వివరించారు. ఆపై క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆ ప్రాంతానికి సంబంధం లేని, బాధితుడు కాని నరేందర్ అనే వ్యక్తి పిటిషన్ వేస్తే హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని రద్దు చేయాలని కోరారు. వాదప్రతివాదనలు విన్న తర్వాత.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయడానికి బాధితుడై ఉండకర్లేదని, ఎవరైనా సంబంధంలేని వ్యక్తి కూడా ఫిర్యాదు చేయవచ్చునని న్యాయస్థానం వెల్లడించింది. పిటిషనర్ చేసుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై ప్రవీణ్కుమార్ కేసులో ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పులోని మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని జీహెచ్ ఎంసీని ఆదేశించింది. పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.