2029లో నిర్వహించే యోచనలో కేంద్రం
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానంలో భాగంగానే
దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలి ప్రక్రియ
2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు
2034 నాటికి మిగతా రాష్ట్రాలనూ కలిపి జమిలి
129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ
రాజకీయ పార్టీలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలనూ స్వీకరిస్తున్న కమిటీ
హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు.. ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఐతే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా.. రెండు దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతోపాటు నిర్వహించాలని, అనంతరం 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. లోక్సభ ఎన్నికలతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అడుగులు వేస్తున్న మోదీ సర్కారు.. ఈ పనిని రెండు దఫాలుగా సాకారం చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తొలిదఫా జమిలిగా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి చాలా దఫాలు పార్లమెంటుతో కలిపే ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన 2014 ఎన్నికలు కూడా జమిలిగానే నిర్వహించారు. అయితే ఆ తర్వాత 2018లో నాటి కేసీఆర్ ప్రభుత్వం లోక్సభతో కాకుండా సుమారు ఐదు నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. 2023లోనూ అదే కొనసాగింది.
రెండు దశల వ్యూహం ఎందుకంటే..
ఒకే దేశం-ఒకే ఎన్నిక వ్యవహారం ఒకేసారి తేలేది కాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు గత ఏడాదే జరగగా.. వాటితోపాటు కేవలం నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ ఎన్నికలు కొంత ముందు, లేదంటే కొంత వెనక జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే ఏకంగా మూడేళ్ల ముందు కూడా జరిగాయి. బిహార్, అసోం, గోవా, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, పాండిచ్చేరి, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు 2021-2022లో ఎన్నికలు జరిగాయి. ఇక ఢిల్లీలో ఈ ఏడాదే ఎన్నికలు జరగగా, బిహార్లో వచ్చే సెప్టెంబరు-అక్టోబరులో జరగనున్నాయి. అయితే 2024 పార్లమెంటు ఎన్నికలకు సుమారు ఏడాది ముందుగానీ, ఏడాది తర్వాతగానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక క్యాటగిరీగా తీసుకోవాలని కేంద్రం యోస్తోంది. అంటే 2028, 2029లో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలను తొలి విడతలో పరిగణనలోకి తీసుకోనున్నారు. 2028లో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీ్సగఢ్, రాజస్థాన్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, హరియాణ, జార్ఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 16 రాష్ట్రాలకు 2029 పార్లమెంటు ఎన్నికలతో కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగతా 15 రాష్ట్రాల్లో ఏవైనా ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయా? అన్నది కూడా పరిశీలిస్తారు. అలా లేని వాటన్నింటినీ.. 2034 నాటికి ఒకే దేశం-ఒకే ఎన్నిక పరిధిలోకి తేవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
పీఎస్యూలు, మాజీ న్యాయమూర్తుల అభిప్రాయాలు కూడా
ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును గత ఏడాది డిసెంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి సంబందించిన అంశాలను ఇందులో పొందుపరిచారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని సిఫారసు చేసింది. పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో అనే అంశంపైనే బిల్లును రూపొందించారు. తొలుత ఈ అంకాన్ని పూర్తిచేస్తే.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో అన్న అంకానికి తెరతీసే అవకాశాలున్నాయి. మరోవైపు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కూడా ఆ అంశంపై అభిప్రాయ సేకరణకు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. తొలుత ఈ కమిటీలో 31 మందిని నియమించగా.. ఆ తర్వాత కొన్ని చిన్న పార్టీలు🔱 తమకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. ఇందుకు కేంద్రం అంగీకరించడంతో ఆ సంఖ్య 39కి పెరిగింది.
రాష్ట్రాల్లో జేపీసీ పర్యటన..
జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, బాన్సురి స్వరాజ్, కె.లక్ష్మణ్, సీఎం రమేశ్ తదితరులుండగా.. కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ, మనీశ్ తివారీ, రణదీప్ సూర్జేవాలా, టీడీపీ నుంచి గంటి హరీశ్, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, దేశంలోని పలు ఇతర పార్టీల ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో పర్యటించింది. మహారాష్ట్ర, పంజాబ్, హరియాణ తదితర రాష్ట్రాల్లో కేవలం రాజకీయ పార్టీల అభిప్రాయాలే కాకుండా.. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటోంది. అనేకసార్లు ఎన్నికలు రావడం వల్ల ఆయా సంస్థలు, బ్యాంకులకు ఏమైనా ఇబ్బందులున్నాయా? వాటి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుందా? అన్న విషయాలపైనా అభిప్రాయ సేకరణ చేస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల అభిప్రాయాలు కూడా సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఐదుగురు మాజీ సీజేలతో మాట్లాడామని, మరింతమంది అభిప్రాయాలు కూడా తీసుకుంటామని కె.లక్ష్మణ్ తెలిపారు.