**ప్రజావాణి దరఖాస్తులపై జాప్యం వద్దు – జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి**
మేడ్చల్ మల్కాజ్గిరి ప్రశ్న ఆయుధం జూన్ 23
ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి మొత్తం 117 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, *“ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారానికి నమ్మకంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. వారి ఆశలను నిలబెట్టే బాధ్యత మనపై ఉంది. అందుకే ప్రతి దరఖాస్తును అత్యవసరంగా పరిశీలించి, పరిష్కారం చూపాలి,”* అని స్పష్టం చేశారు.అదనంగా, తిరస్కరించిన దరఖాస్తుల విషయంలో అర్జీదారులకు తిరస్కరణకు గల కారణాలు పూర్తి వివరంగా తెలియజేయాలనీ, వారి సందేహాలు నివృత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.