*కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుంది..
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారు కాబట్టే ఈ రోజు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడంతోపాటు పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీకి పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును పిలిచి ప్రజాభవన్లో బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చిందే రేవంత్రెడ్డి అన్నారు.
2016లో పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనే ప్రస్తావనే లేదన్నారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు మహేందర్, సంపత్గౌడ్, రూప్సింగ్, అర్చనా సేనాపతి, లలిత యాదవ్, శోభ తదితరులు పాల్గొన్నారు..