ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.2.10 లక్షల మోసం
నిజామాబాద్ మున్సిపాలిటీలో ఉద్యోగం పేరిట మాయ మాటలు
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం, సెప్టెంబర్ 18 (ప్రశ్న ఆయుధం) నవీపేట్ మండలంలో
ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువకుడిని మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న నాళేశ్వర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడి నుండి చిన్నయ్య అనే వ్యక్తి మాయమాటలు చెప్పి రూ.2.10 లక్షలు వసూలు చేశాడు.
ప్రశాంత్ వివరాల ప్రకారం… ‘‘నిజామాబాద్ నగరపాలక సంస్థలో అనిల్ అనే ఉద్యోగి తనకు పరిచయమంటూ చిన్నయ్య నమ్మబలికాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో మామయ్య రవి ఫోన్ ద్వారా పలు దఫాలుగా డబ్బులు చెల్లించాం. అయితే తన ఖాతాకు కాకుండా ఇతరుల ఖాతాలకు డబ్బులు పంపించమన్నాడు’’ అని తెలిపారు.
తొమ్మిది నెలలుగా ఉద్యోగం లభించకపోవడంతో చిన్నయ్యను ప్రశాంత్ నిలదీయగా… మొదట్లో 15 రోజుల్లో డబ్బులు తిరిగిస్తానని చెప్పి, తరువాత రెండు నెలలు గడిపేశాడు. తాజాగా అడిగితే మాత్రం తాను డబ్బులు తీసుకోలేదంటూ దబాయిస్తున్నాడని బాధితులు వాపోయారు.
ఈమేరకు నవీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. చిన్నయ్యను పోలీసులు పిలిపించి విచారించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లేకపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.