*జనవరి 28 నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు*
తిరుపతి, 2025 జనవరి 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి.
ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7.15 నుంచి 8.15 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 7న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 13న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 17న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.