పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

*పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి*

*మన యుద్ధ విమానాలకు ముప్పు తప్పించే లక్ష్యం*

పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలపై భారత్‌ గురిపెట్టింది. లాహోర్‌, రావల్పిండి, కరాచీ సహా ఏకంగా తొమ్మిది నగరాల్లోని పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై దాడులు చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న హెచ్‌క్యూ 9, ఎల్‌వై 80 వంటి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పాక్‌ వద్ద ఉన్నాయి. భారత యుద్ధ విమానాలు, క్షిపణులను అడ్డుకుని కూల్చివేయడం ఈ వ్యవస్థల లక్ష్యం. అందువల్ల భారత్‌ వ్యూహాత్మకంగా వీటిపై గురిపెట్టింది. సైనిక పరిభాషలో ఇటువంటి ఆపరేషన్లను ‘సియాడ్‌’ (సప్రెషన్‌ ఆఫ్‌ ఎనిమీ ఎయిర్‌ డిఫెన్సెస్‌) అంటారు. మన యుద్ధ విమానాలకు శత్రు ఎయిర్‌ డిఫెన్స్‌ నుంచి ముప్పు ఏర్పడినప్పుడు గానీ, లేదా శత్రు భూభాగంలో త్వరలో భారీ దాడులు చేయాలని భావించినప్పుడు గానీ ఈ సియాడ్‌ దాడులు చేస్తారు. భారత్‌ ఇంత పెద్దఎత్తున అనేక పాక్‌ నగరాల్లో సియాడ్‌ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల్లో రాడార్లు ప్రధానమైనవి. ఇవి యుద్ధ విమానాలు, క్షిపణులపైకి రాడార్‌ సిగ్నల్స్‌ను పంపి వాటి ఆచూకీని కనిపెడతాయి. ఆ తర్వాత క్షిపణులు వెళ్లి వాటిని అడ్డుకుని ధ్వంసం చేస్తాయి. అయితే ఈ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల నుంచి వెలువడే రాడార్‌ సిగ్నల్స్‌ ఎదుటి విమానాల్ని కనిపెట్టేందుకే కాదు, తమ ఆచూకీ ఎదుటివారు తెలుసుకునేందుకూ ఉపయోగపడతాయి. ఇలా శత్రు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల నుంచి వెలువడే రాడార్‌ సిగ్నల్న్‌ను కనిపెట్టి దాడి చేసే రుద్రమ్‌, కేహెచ్‌-31పీ అనే క్షిపణులు భారత్‌ వద్ద ఉన్నాయి.

వీటిలో కేహెచ్‌-31పీ రష్యన్‌ది కాగా రుద్రమ్‌ క్షిపణి దేశీయంగా రూపొందించినది. వీటితోపాటు ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన హరోప్‌ కామికాజ్‌ డ్రోన్లను కూడా గురువారం నాటి దాడుల్లో ఉపయోగించారు. ఇవి రాడార్‌ సిగ్నల్స్‌ను కనిపెట్టి ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వద్దకు చేరుకోవడంతోపాటు దానిపై ఆకాశంలో ఎగురుతూ అకస్మాత్తుగా దాడి చేస్తాయి. భారత్‌ ఇలాంటి 25 పైగా డ్రోన్లను పాక్‌పైకి పంపినట్లు సమాచారం. వీటన్నింటినీ కూల్చివేసినట్టు పాక్‌ ప్రకటించినప్పటికీ లాహోర్‌లోని పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై ఈ డ్రోన్‌ దాడి చేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. లాహోర్‌లో చేసిన దాడిలో లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించినట్లు భారత రక్షణ శాఖ సైతం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment