*సరిహద్దుల్లో కాల్పులు.. అమిత్ షా తాజా ఆదేశాలివే*
న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాకిస్థాన్ చేస్తున్న చర్యలపై కేంద్రం అప్రమత్తమైంది. భారత సరిహద్దులో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే వెనక్కి రప్పించాలని పారా మిలటరీ బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత ఆర్మీ ధీటుగా జవాబిచ్చింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.
ఈ దాడి అనంతరం భారత్, పాక్ నియంత్రణ రేఖ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. భారత్ సరిహద్దు చెక్పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రేంజర్లు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసినప్పటి నుంచి పాక్ ఈ కాల్పులను మొదలుపెట్టింది. ఈ కాల్పుల్లో సుమారు 8 మంది పౌరులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే నలుగురు సైనికులు కూడా గాయపడినట్లు తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.