*సీఐఎస్ఎఫ్కు అమిత్షా కీలక ఆదేశాలు*
న్యూఢిల్లీ: ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలకు కీలక ఆదేశాలిచ్చారు. కీలక సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని శుక్రవారం నాడు ఆదేశించారు. విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, అంతరిక్ష పరిశోధనా సంస్థలు, కీలక ప్రభుత్వ భవనాల రక్షణ బాధ్యత సీఐఎస్ఎస్ చేపడుతోంది. సరిహద్దుల్లో భద్రత, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్లపై శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో అమిత్షా సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించారు.
పాక్ డోన్ల్ దాడులను తిప్పికొట్టిన సైన్యం
గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత మిలటరీ సంస్థలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని వెస్ట్రన్ బోర్డర్ వెంబడి పాక్ సాయుధ బలగాలు డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. అయితే ఈ దాడులను భారత్ బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పెద్ద సంఖ్యలో పాక్ డ్రోన్లను బలగాలు కుప్పకూల్చాయి. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు భారత ఆర్మీ కట్టుబడి ఉందని, పాక్ కుట్రలను తిప్పికొడతామని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆర్మీ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి ఉదంపూర్, సాంబ, జమ్మూ, అక్నూర్, నగ్రోటా, పఠాన్కోఠ్ ప్రాంతాల్లో 50కి పైగా పాక్ డ్రోన్లను విజయవంతంగా కుప్పకూల్చివేసినట్టు మీడియాకు తెలిపింది.