*అన్నదాత సుఖీభవ పథకం – ఈనెల 20లోగా వివరాలు నమోదు చేసుకోండి*
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన రైతులకు రూ. 20,000 ఆర్థికసాయం – పలు వివరాలు తెలిపిన అధికారులు
ఎవరికి వర్తించదు అంటే:
ఇప్పటికే పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ. 6,000ను రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. మిగిలిన రూ. 14,000 సాయాన్ని మూడు విడతల్లో కూటమి ప్రభుత్వం రైతులకు అందించనుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు ముందే ఈ సాయాన్ని అందించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు సైతం మొదలు పెట్టింది. ప్రజా ప్రతినిధులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.
రైతు సేవా కేంద్రాలకు ఫైనల్ లిస్ట్: జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్ల్యాండ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పింపిస్తారు. అక్కడ నుంచి ఆర్జీఎస్కు పంపిన తరువాత, ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుసంధానంగా అనర్హులను గుర్తిస్తారు. అనంతరం ఫైనల్ జాబితాను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు. అందులోని లబ్ధిదారులందరితో సంబంధిత అధికారులు ఈ-కేవైసీ చేపిస్తారు.
లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇందుకోసం రైతుసేవా కేంద్రాల వారీగా వెబ్ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో (Village Agricultural Assistants) పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్లకు ఇచ్చారు. వెబ్ల్యాండ్లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం రైతు సేవాకేంద్రాల్లో పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయాధికారి లాగిన్కు ఆ వివరాలను పంపిస్తారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వివరాలు వెళ్తాయి. వెబ్ల్యాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి లిస్ట్ నుంచి తొలగిస్తారు. అర్హులంతా తమ వివరాలను రైతుసేవా కేంద్రాల్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
20వ తేదీలోగా నమోదు చేసుకోవాలి: అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అనకాపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.రామారావు తెలిపారు. ఇప్పటికే పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతు సేవా కేంద్రంలో ఈనెల 20లోగా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.