ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసుల సంఖ్య భారత్లో మూడుకు చేరింది.కేరళలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైనట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా.. పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.భారత్లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా నిర్ధరించిన విషయం తెలిసిందే. అనంతరం యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్థారణ అయినట్లుగా సెప్టెంబర్ 18న కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 122 దేశాల్లో 99,518 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తుండడంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.