*”రా” చీఫ్ గా పరాగ్ జైన్ నియామకం*
భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) తదుపరి చీఫ్ గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. 1989 పంజాబ్ కేడర్ కు చెందిన ఆయన.. జులై 1న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ‘రా’ చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30న ముగియనుండడంతో తదుపరి అధిపతిగా పరాగ్ జైన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
నిఘా విభాగంలో ‘సూపర్ డిటెక్టివ్’గా పేరున్న పరాగ్ జైన్ ఎన్నో కీలక ఆపరేషన్లకు నేతృత్వం వహించారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లోనూ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. పీవోకేతోపాటు పాకిస్థాన్లో అనేక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు కొన్ని నిమిషాలే పట్టినప్పటికీ.. ఈ కచ్చితమైన లక్ష్యాలను సాధించేందుకు మన నిఘా విభాగం కొన్నేళ్ల పాటు గ్రౌండ్వర్క్ చేసింది. ఇందులో జైన్ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిసింది. 2021లో పంజాబ్లో డీజీపీ ర్యాంక్ పొందిన జైన్.. డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వచ్చారు.