ప్రెస్ నోట్
తేదీ: 16-05-2025
జిల్లా: కామారెడ్డి
పోలీస్ స్టేషన్: ఎల్లారెడ్డి
క్రైం నం.: 18/2025 U/s 103(1), 238 BNS
షేక్ అహ్మద్ హత్య కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి కీలక ఆధారాలను సేకరించారు.
అరెస్టైన నిందితుల వివరాలు:
1. కూర్మ సాయిలు, s/o బాలయ్య, వయస్సు: 52 సంవత్సరాలు, వృత్తి: రైతు, నివాసం: షాతెల్లి గ్రామం, ఎల్లారెడ్డి మండలం.
2. పౌలవ్వ, w/o షేక్ అహ్మద్, వయస్సు: సుమారు 40 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: లింగారెడ్డిపేట గ్రామం.
కేసు నేపథ్యం:
2025 జనవరి 24వ తేదీన షేక్ అహ్మద్ అదృశ్యమయ్యాడు. జనవరి 28న అతని భార్య పౌలవ్వ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసింది. విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
హత్య తీరు:
నిందితులైన పౌలవ్వ మరియు కూర్మ సాయిలు మధ్య అక్రమ సంబంధం కొనసాగుతున్నది. షేక్ అహ్మద్ ఈ సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంగా, ఇద్దరూ కలిసి అతన్ని హత్య చేయాలని పథకం రచించారు.
జనవరి 24న, అహ్మద్ను పూజ పేరుతో ఎల్లారెడ్డి అడవిలోని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి, మద్యం తాగించి మత్తులో ఉన్న సమయంలో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతని పురుషాంగాన్ని నలిపి, శరీరంపై పెట్రోల్ పోసి కాల్చారు.
తరువాత పౌలవ్వ అనుమానం రాకుండా మిస్సింగ్ ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అయితే కాల్ రికార్డులు, ఫోన్ లొకేషన్లు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అసలు నిజాన్ని పోలీసులు వెలికితీశారు.
పోలీసుల సేకరించిన ఆధారాలు:
• నిందితుల పూర్తి ఒప్పుకోలు (కంప్లీట్ కాన్ఫెషన్)
• హతుడి మొబైల్ ఫోన్ మరియు వెండి కడియం స్వాధీనం
• నిందితులు ఉపయోగించిన TVS XL ద్విచక్ర వాహనం స్వాధీనం
• కాల్ డేటా, లొకేషన్ ఆధారాలు
• సంఘటన స్థల పరిశీలన
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ముందు హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
ఈ కేసు ఛేదనలో ఎల్లారెడ్డి సీఐ శ్రీ బి.రవీందర్ నాయక్ నేతృత్వంలో విశేష కృషి చేసిన ఎస్ఐ బి మహేష్ మరియు పోలీస్ బృందం, ముఖ్యంగా కానిస్టేబుళ్లు అనిల్, సిద్ధు, ప్రసాద్, ఇద్రిస్లకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు.