సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 01 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయుడబ్ల్యూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి గురువారం నాడు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మరింత స్పూర్తివంతంగా పని చేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లా యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరిస్తున్నామని, అందువల్ల జిల్లా యంత్రాంగం కూడా జర్నలిస్టుల పట్ల అదేవిధంగా సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొత్త అక్రిడేషన్ పాలసీ వచ్చిందని, దానిలో కూడా అనేక మార్పులు చేయాల్సిందిగా తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ ఆధ్వర్యంలో ఇటీవల విజ్ఞప్తి చేశామన్నారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి దీనికి సంబంధించిన వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వ పాలసీ ప్రకారం అక్రిడేషన్ కార్డులను అందించాల్సిందిగా కోరారు. దీనికి తోడు ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల నిబద్ధతతో ఉన్నదని ఆయన వివరించారు. ఈ సంవత్సరం తీపి కబురు చెబుతామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ సంఘం నేతలకు హామీ ఇచ్చారని వివరించారు. ఆ ప్రకారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలతో పాటు ఉచిత విద్య వైద్య సౌకర్యాలను కల్పించాలని, బస్సు పాస్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ ను కలిసిన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి
Oplus_16908288