*మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..*
*శ్రీనగర్, మే 09*
భారత్, పాకిస్థాన్ల మధ్య జరుగుతోన్న కాల్పుల్లో అమాయక చిన్నారులతోపాటు మహిళలు మరణిస్తున్నారని జమ్మూ కశ్మీర్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న టెన్షన్లు నివారించేందుకు రాజకీయ జోక్యం అవసరమని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఈ దాడులపై తొలిసారిగా మహబూబా ముఫ్తీ స్పందించారు.
శుక్రవారం శ్రీనగర్లో మాజీ సీఎం మహబూబా ముఫ్తీ విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన పుల్వామా అయినా.. పహల్గాం అయినా.. ప్రమాదం మాత్రం దేశ అంచునకు తీసుకు వెళ్లాయన్నారు. సరిహద్దు ప్రాంతంలో చిన్నారి కవలలు ఆడుకోవడం చూశానని.. అదే చిన్నారులు రక్తం మడుగులో పడి విగత జీవులుగా ఉండడాన్ని సైతం చూశాన్నారు. ఇలా విగత జీవులుగా మారుతోన్న చిన్నారులు, మహిళలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఈ వారి మరణాలకు తప్పు ఎవరిదంటూ ఆమె నిలదీశారు. చిన్నారుల మరణంతో ఆ తల్లల ఒడి ఖాళీగా మారుతోందని.. ఇలా ఎంత కాలమంటూ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కన్నీటి పర్యంతమవుతూ ప్రశ్నించారు.