ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
పారిశుద్ధ్య పనుల్లో మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్
ప్రశ్న ఆయుధం, అక్టోబర్ 30
కామారెడ్డి జిల్లా పరిధిలోని రాజంపేట పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ గారు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వర్షాల ప్రభావంతో పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ మురుగు నీటి పారుదల, చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
“వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పారిశుద్ధ్యం అత్యంత ప్రాధాన్యత కలిగినదని” ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, లబ్ధిదారులు వేగంగా ఇళ్లు పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నందున, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మార్కావుట్ పనులు వంద శాతం పూర్తి చేయాలని, బేస్మెంట్, రూఫ్, స్లాబ్ స్థాయిల వారీగా బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
సారంపల్లి గ్రామంలో ఒక లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న కలెక్టర్, “ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు ఇంకా నిర్మాణం ప్రారంభించని పక్షంలో వెంటనే మొదలు పెట్టాలి” అని సూచించారు.
అలాగే అర్హత కలిగిన కొత్త దరఖాస్తుదారులకూ శాంక్షన్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ఐకెపి మహిళా సంఘాల ద్వారా బ్యాంక్ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మదన్మోహన్, పిడి హౌసింగ్ జైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సి హెచ్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్, ఆర్ ఐలు, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.