బాంబుల వర్షం…ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

Israel-Iran war: బాంబుల వర్షం…ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్*

  • ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి
  • టెహ్రాన్ లో భయానక పరిస్థితులు..నగరాన్ని వీడుతున్న జనం
  • జీ7 నుంచి అర్ధంతరంగా వచ్చేసిన ట్రంప్…కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం.. ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్యజ
  • ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు…
  • మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి
  • ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు
  • సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు

 

టెహ్రాన్, టెల్ అవీవ్, దుబాయ్, వాషింగ్టన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదో రోజైన మంగళవారం పరస్పరం జరుపుకొన్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయెల్ లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడిచేసిన ఇరాన్.. డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నగరాన్ని వీడుతున్నారు. ఇక జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధంతరంగా వాషింగ్టన్ వచ్చేశారు. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని బట్టి ఏదో జరగబోతోందని అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్లో చిక్కుకున్న కొంత మంది భారత విద్యార్థులు మంగళవారం సరిహద్దులు దాటి ఆర్మేనియాలోకి వచ్చారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారు అయిన అలీ షాధ్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. గతంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో సీనియర్ సైనికాధికారి అలీ రషీద్ మృతి చెందడంతో..

అలీ షాద్మానీని ఇటీవల సాయుధ దళాలకు నూతన నాయకుడిగా ఖమేనీ నియమించారు.

టెహ్రాన్ డౌన్జన్కు సమీపంలోని 3,30,000 మంది ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. కోటి మంది జనాభా ఉండే ఈ నగరం నుంచి పలువురు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 224 మంది మరణించారు. 1,277 మంది గాయపడ్డారు.

టెహ్రాన్ గగన తలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. 120 క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది. టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అక్కడున్న రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. దాడుల్లో ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం కుడ్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇరాన్ బ్యాంకులపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లపై ఇరాన్ పాక్షిక బ్యాన్ విధించింది.

మొస్సాద్ కు దెబ్బ

ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్పై ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. పలు భవనాలు, వాహనాలపై క్షిపణులు పడడంతో మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిసింది. మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైనా ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లో మొస్సాద్ ఏర్పాటు చేసుకున్న డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. గ్లిలాట్లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్పైనా క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఇప్పటిదాకా 370 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ లో 24 మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడ్డారు.

సోమవారం ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ లోని హైఫాలోని చమురు శుద్ధి కేంద్రం ధ్వంసమైంది.

అంతకు మించి..

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికా చేరుకున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం ఆయన కెనడాలోనే పర్యటించాల్సి ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లడం ప్రాధాన్యంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ హడావుడిగా సిచువేషన్ రూమ్ను సిద్ధం చేయించి.. వాషింగ్టన్కు వచ్చారు. రాగానే రక్షణ మంత్రి హెగ్సెత్తో భేటీ అయ్యారు. దీంతో ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ తో అమెరికా చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సిందే. ఇది సుమారు 13,600 కిలోల బరువుంటుంది. దీనిని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన బి-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాల పశ్చిమాసియా సమీపంలోని డీగో గార్సియా బేస్కు అమెరికా చేర్చింది. రీప్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలనూ పశ్చిమాసియాకు తరలిస్తోంది. బ్రిటన్ తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండటం ఉద్రిక్తతను పెంచుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి విట్కాఫ్ను ఇరాన్తో చర్చల కోసం పంపుతానని ట్రంప్ తెలిపారు.

ఇజ్రాయెల్కే తమ మద్దతు ఉంటుందని జీ7 దేశాల కూటమి ప్రకటించింది. ఇరాన్ ఉగ్రవాద శక్తులను పెంచి పోషిస్తూ పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతోందని ఆరోపించింది.

హర్మూజ్ జల సంధిలోని ఇరాన్, ఒమన్ తీరాల సమీపంలో మూడు నౌకలు తగలబడుతున్నట్లు సమాచారం.

అర్మేనియా చేరుకున్న భారతీయ విద్యార్థులు

ఇరాన్ చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థులు అర్మేనియా చేరుకున్నారని విదేశాంగశాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం వారు ఢిల్లీకి రానున్నారని వెల్లడించింది. మరోవైపు టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని వీడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారత రాయబార కార్యాలయం మరో అడ్వైజరీ జారీ చేసింది.

ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని సూచించారు. ‘ఖమేనీ మాకు సులభమైన లక్ష్యమే. అయితే ఆయనను ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదు. ప్రజలపైనా, అమెరికా సైనికులపైనా క్షిపణులను ప్రయోగించడాన్ని కోరుకోవడంలేదు’ అని తన ట్రూత్ సోషల్ మీడియా వేదికలో ట్రంప్ ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment