గజ్వేల్, 24 ఫిబ్రవరి 2025 : గజ్వేల్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళ సోమవారం ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలోని అడవి మసీదు గ్రామానికి చెందిన నర్సింలు, నాగరత్న దంపతులకు పెళ్ళైన ఏడు సంవత్సరాలకు గర్భం దాల్చింది. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం మొదటి కాన్పులో ముగ్గురు పిల్లలు (ఇద్దరు మగ, ఒక ఆడ బిడ్డ) లకు జన్మనివ్వడం తో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, ఆర్ ఎం ఓ డాక్టర్ రాము మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, తమ ఆస్పత్రిలో మహిళకు జరిగిన కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన డాక్టర్ మంజుల, డాక్టర్ త్రివేణి, అనస్థీషియా సుశీల, అఫ్రోజ్, ఓటీ సిబ్బందిని అభినందించారు.