ఇందిరమ్మ ఇళ్ల అవకతకలపై కమిషనర్ సుజాతను నిలదీసిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు..
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మున్సిపల్ పరిధిలో వార్డు స్థాయి ఇందిరమ్మ కమిటీలలో తాము ఇచ్చిన పేర్లను కాకుండా కాంగ్రెస్ నాయకులను పేర్లను చేర్చడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఛాంబర్లో కమీషనర్ సుజాతను నిలదీశారు. బల్ధియాలో 49వార్డులకు సంబంధించి స్థానిక వార్డు కౌన్సిలర్ చైర్మన్గా స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, స్థానిక వార్డులో నివసించే ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఒక్కోక్కరి చొప్పున సభ్యులుగా, అలాగే ఆ వార్డు ఆఫిసర్ కన్వీనర్గా ఇందిరమ్మ కమిటిలను మున్సిపల్ కమీషనర్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పిట్ల వేణు, అంజల్రెడ్డి, స్వప్న, నజీరోద్దిన్, భాస్కర్, ఆఫిజ్తో పాటు ప్రతిపక్షాల వార్డుల కమిటిలలో కాంగ్రెస్ నాయకుల పేర్లను చేర్చడం, ఇతర వార్డులలో నివసించే కాంగ్రెస్ నాయకులను తమ వార్డులో కమిటీలలో ఎలా ఉంటారని కమీషనర్ను నిలదీశారు. 43వ వార్డులో నివసించే మాజీ వైస్ చైర్మన్ మసూద్ అలీని తన వార్డు కమిటిలో ఎలా ఉంటాడని 25వ వార్డు కౌన్సిలర్ అంజల్రెడ్డి ప్రశ్నించారు. తన వార్డులో మొత్తం కాంగ్రెస్ నాయకులే పేర్లు పెట్టారని 47వ వార్డు కౌన్సిలర్ నిలదీశారు. ఇలాగైతే వార్డులలో కాంగ్రెస్ పెత్తనంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాకుండా అన్యాయం జరుగుతుందని కౌన్సిలర్లు వాపోయారు. కమిటీల ఏర్పాటుకు పేర్లు ఇవ్వాలని వారం రోజుల పాటు ఒత్తిడికి గురి చేసి చివరకు తాము ఇచ్చిన పేర్లను ఎలా మార్చుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఆదేశాల మేరకు పేర్లు మార్చాల్సి వచ్చిందని కమీషనర్ సుజాత సమాధానం ఇచ్చారు. దీంతో కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.