Headlines (Telugu)
-
6నుంచి కులగణన సర్వే: ప్రాథమిక ఉపాధ్యాయులతోనే నిర్వహణ
-
80,000 మంది సిబ్బంది కులగణనలో భాగస్వామ్యం
-
మునుపటి పాఠశాలలు: ప్రాధమిక, ఉన్నత పాఠశాలల టీచర్లకు మినహాయింపు
*6 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం..*
*మూడు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశం..*
*36,559 మంది ఎస్జీటీలు, 3,414 మంది పీఎస్హెచ్ఎంల భాగస్వామ్యం..*
*6,256 మంది ఎంఆర్సీలు, 2 వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది కూడాఉత్తర్వులు విడుదల..*
*ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల టీచర్లకు మినహాయింపు..*
ఈనెల ఆరో తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కులగణన సర్వేకు ప్రాథమిక ఉపాధ్యాయులనే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈనెల ఆరో తేదీ నుంచి మూడు వారాల వ్యవధిలో (ఈనెల 30 వరకు) కులగణన సర్వేను పూర్తి చేయడానికి ఉపాధ్యాయులతో సహా 80 వేల మంది ఎంఆర్వో ఉద్యోగులు, ఎండీవో ఎంపీవోలు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తున్నామనీ, సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ముసాయిదాను రూపొందించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 3,414 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు (పీఎస్హెచ్ఎం) 6,256 మంది ఎంఆర్సీ సిబ్బంది, రెండు వేల మంది ప్రభుత్వ, ఎంపీపీ/జెడ్పీపీ, ఎయిడెడ్ పాఠశాలల్లోని మినిస్టీరియల్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సర్వేకోసం అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల సేవలను కూడా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
*మధ్యాహ్నం ఒంటి గంట వరకు బడి, ఆ తర్వాత కులగణన సర్వే..*
కులగణన సర్వేను నిర్వహించేందుకు ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీలు, పీఎస్హెచ్ఎంల సేవలను వినియోగించడానికి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను ఉదయం తొమ్మిది నుంచే నడపాలని నిర్ణయించామని వెంకటేశం తెలిపారు.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బోధన ఉంటుందనీ, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత విద్యార్థులను ఇంటికి పంపిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి ఎస్జీటీలు, పీఎస్హెచ్ఎంలు ప్రణాళికా విభాగం సమన్వయంతో కులగణన సర్వే విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీల సేవలను కులగణన విధుల నుంచి మినహాయించబడ్డాయని వివరించారు. ఈ పాఠశాలలు షెడ్యూల్ ప్రకారమే పనిచేస్తాయని తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది అన్ని సెలవుల్లో ప్రణాళికా విభాగం సూచనల మేరకు సర్వేకు హాజరు కావాలని కోరారు. ప్రణాళికా విభాగం నిబంధనల ప్రకారం వేతనాన్ని చెల్లించాలని పేర్కొన్నారు..
*విద్యాశాఖలో 50 వేల మందికి విధులు : *
విద్యాశాఖలో 50 వేల మందికి కులగణన సర్వే విధులు కేటాయించామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో 36,559 మంది ఎస్జీటీలు, 3,414 మంది పీఎస్హెచ్ఎంలు, 6,256 మంది ఎంఆర్సీలు, రెండు వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది ఉన్నారని వివరించారు. కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని వినియోగిస్తామని పేర్కొన్నారు. వారు ఇంటింటి సర్వే చేపట్టాలని కోరారు.
*ఎస్జీటీలకే కేటాయించడానికి టీపీటీఎఫ్ ఖండన..*
కులగణన విధులను ఎస్జీటీలకే కేటాయించడాన్ని టీపీటీఎఫ్ ఖండించింది. అన్ని రకాల పాఠశాలల్లో అధికంగా ఉపాధ్యాయులను గుర్తించి విధులను కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి తెలిపారు. పాఠశాలల పనివేళలకు ఆటంకం కలగించొద్దని కోరారు.
*ఉపాధ్యాయులందరికీ విధులు కేటాయించాలి : టీఎస్టీయూ..*
కులగణన విధులను ఉపాధ్యాయులందరికీ కేటాయించాలని టీఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి తెలిపారు. ఈ ఉత్తర్వులను సవరించాలని కోరారు..
*మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు : టీఎస్యూటీఎఫ్..*
ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశంలో చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ కులగణన సర్వే ఉత్తర్వులను జారీ చేసిందని టీఎస్యూటీఎఫ్ విమర్శించింది. బోధనాభ్యసన ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలని కోరినా పట్టించుకోలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి విమర్శించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రమే విధులు వేసి ఒక పూట బడి నడిపి మధ్యాహ్నం సర్వే చేయాలనడం ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. ముమ్మరమైన వ్యవసాయ పనుల రోజుల్లో పిల్లలను మధ్యాహ్నమే ఇంటికి పంపడాన్ని తల్లిదండ్రులు అంగీకరించబోరని వివరించారు. మధ్యాహ్నం సర్వేకు అనుకూల సమయం కూడా కాదని తెలిపారు. సెలవు రోజుల్లో చేయొచ్చని సూచించారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో సహా ఎక్కువ మందికి విధులు వేసి తక్కువ ఇండ్లను కేటాయించొచ్చని కోరారు. కొందరు ఉదయం మరికొందరు మధ్యాహ్నం వంతులవారీగా సర్వేకు హాజరయ్యేలా చూడటం సమంజసంగా ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కులగణన సర్వేను పాఠశాలలకు అంతరాయం కలగకుండా నిర్వహించేలా ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు..