జ్వరం, నొప్పుల మందులపై కేంద్రం నిషేధం..
156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. జ్వరం, జలుబు, అలెర్జీలు, నొప్పుల కోసం ఉపయోగించే యాంటీబ్యాక్టీరియల్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటి వల్ల హాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం ఈ నెల 12న జారీ చేసింది. రెండు లేదా మూడు క్రియాశీలక ఔషధ పదార్థాలు నిర్దిష్ట నిష్పత్తిలో ఉండే మందులను ఎఫ్డీసీ మందులు అంటారు. వీటిని కాక్టెయిల్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు. నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే అసెక్లోఫెనాక్ 50 ఎంజీ+పారాసిటమాల్ 125 ఎంజీ ట్యాబ్లెట్ కాంబినేషన్ కూడా నిషేధానికి గురైన ఎఫ్డీసీ మందుల జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్డీసీలను అధ్యయనం చేసి, ఇవి అహేతుకమైనవని చెప్పిందని ఈ నోటిఫికేషన్ పేర్కొంది.