*సవాల్ చేస్తే చావుదెబ్బే..*
*దేశ సమగ్రతే టాప్ ప్రయారిటీ: రాజ్నాథ్ సింగ్*
సవాల్ చేయడాలు, కుతంత్రాలు చేస్తూ కపటనాటకాలాడితే చావుదెబ్బ తీస్తామంటూ పాకిస్థాన్ ను హెచ్చరించారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ సమగ్రతే టాప్ ప్రయారిటీ అని చెప్పిన రాజ్నాథ్ “మా సార్వభౌమత్వాన్ని ఎవరు సవాల్ చేయలేరు. ఒక వేళ అలా అనుకుంటే ఊరుకునేది లేదు. దాడులకు ప్రతి దాడులు తప్పవు. దేశ సమగ్రత, భద్రతే మాకు ముఖ్యం. మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నాం.” అని రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ కు తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందన్న ఆయన.. భారతదేశ సహనాన్ని పరీక్షించొద్దని పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఇవాళ(గురువారం) కూడా కొనసాగుతోందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. భారతదేశ సంరక్షణ అన్నింటికంటే ముఖ్యమని ఆయన అన్నారు. పాకిస్తాన్పై కచ్చితమైన దాడులు చేసిన భారత సాయుధ దళాలను రాజ్ నాథ్ మరోసారి ప్రశంసించారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారన్నారు. రక్షణ రంగ ఉత్పత్తి, సాధికారతపై మోదీ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రక్షణ రంగంలో సార్వభౌమాధికారం ఉండాలని ప్రధాని మోదీ చెప్పేది ఇందుకేనని రాజ్ నాథ్ వెల్లడించారు.