కూటమి నేతలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: చంద్రబాబు వార్నింగ్.
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తా వించారు.వైసీపీ నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారని, వారంతా సోషల్ మీడియాలో రెచ్చిపోయారని తెలిపారు.అందుకే పోలీసులు వారిని అరెస్టు చేశారని చంద్రబాబు చెప్పారు. అయితే.. కేవలం వైసీపీ నేతలకే కాదని.. మహిళలను, ఇంట్లో వాళ్లను అవమానించేలా.. వారు నొచ్చుకునేలా ఎవరూ కామెంట్లు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను పారదర్శకంగా ఉంటానని తెలిపారు. కూటమి నాయకులను కూడా ఉపేక్షించేది లేదన్నారు. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.