*కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్*
*అంబేద్కర్ ఇచ్చిన హక్కులను కాలరాస్తుంది కాంగ్రెస్ పార్టీ.*
*ఆశ పడితే గోస పడతాం అన్న కేసీఆర్ మాట నిజమైంది.*
*స్థానిక ఎన్నిల లబ్ధి కోసమే రైతు భరోసా ప్రకటన*
సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మాటలు నీటి ముటల వలె తేలిపోయాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఎకరానికి రూ.10వేల రైతు బంధు ఇవ్వగా, తాము ఎకరానికి రూ.15వేలు ఇస్తామని మాయ మాటలతో రైతులను మబ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రూ.15వేలకు బదులుగా రూ 12వేలు ఇస్తామని రైతన్నకు వెన్నుపోటు పొడిచిన వైఖరిని నిరసిస్తూ టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రైతులు పెద్ద ఎత్తున టేక్మాల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. మాయ మాటలు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రూ. 2లక్షల రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికిని ఇప్పటికి చాలా గ్రామాల్లో రుణమాఫీ కాలేనివారు చాలా మంది ఉన్నారని, అందులో అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని కాంగ్రెస్ కార్యకర్తలే బాధ పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన రైతు బందు వస్తలేదని, కేసీఆర్ కిట్టు వస్తలేదని, కల్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదన్నారు. ఈ వర్షకాలం వరి ధాన్యం కొనుగోలులో సగానికిపైగా దాన్యం దళారుల పాలైందన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం లేని రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యాన్ని అమ్ముకున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో 24గంటలు వ్యవసాయానికి కరెంటు ఇస్తే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్ధితి నెలకొందన్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఆశ పడితే గోస పడతాం అనే విషయం నిజమైందన్నారు. ఇప్పుడు ఇస్తామంటున్న రైతు భరోసా కూడా కేవలం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన తప్ప రైతుల శ్రేయస్సు కోసం చేసింది కాదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా మోసపోతే మరో నాలుగేళ్లపాటు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరన్న, పుల్కల్ మండల అధ్యక్షుడు మాచర్ల విజయకుమార్, జేఏసీ నాయకులు ఎర్రోళ్ల పోచయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.