**ఆర్థిక భారం ఉన్నా పేదల సంక్షేమం కొనసాగుతుంది: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్నా ఆయుధం జూన్ 17
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నప్పటికీ, పేదల సంక్షేమాన్ని విస్మరించకుండా, రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలంలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు హాజరై, డాక్టర్ మహేందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ, “ఆర్థిక ఒత్తిడులు ఉన్నా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఏ రకమైన తగ్గుదల ఉండదు. ఈ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని చెప్పారు.కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించామని, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరై ప్రజాస్వామ్య పరమైన మంచి సంకేతంగా నిలిచిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 805 లబ్ధిదారులకు రూ. 8 కోట్లు 5 లక్షల 93 వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
* **మేడ్చల్ మండలం:** 139 లబ్ధిదారులు – రూ. 1,39,16,124/-
* **షామీర్పేట్ మండలం:** 71 లబ్ధిదారులు – రూ. 71,08,236/-
* **మూడుచింతలపల్లి మండలం:** 27 లబ్ధిదారులు – రూ. 27,03,132/-
* **కీసర మండలం:** 136 లబ్ధిదారులు – రూ. 1,36,15,776/-
* **కాప్రా జవహర్నగర్:** 81 లబ్ధిదారులు – రూ. 81,09,396/-
* **ఘట్కేసర్ మండలం:** 131 లబ్ధిదారులు – రూ. 1,31,15,196/-
* **మేడ్పల్లి మండలం:** 220 లబ్ధిదారులు – రూ. 2,20,25,520/-
కార్యక్రమానికి ముందు తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కళాకారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పాటలతో ఆహుతులను అలరించారు.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దారులు యాదగిరిరెడ్డి (షామీర్పేట్), రజిని (ఘట్కేసర్), అశోక్ (కీసర), నర్సింహారెడ్డి (మూడుచింతలపల్లి), సుచరిత (కాప్రా), హసీన (మేడ్పల్లి)తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.