పాముకాటుతో చిన్నారి మృతి.. బాన్సువాడలో విషాదం
కాలునాయక్ తండాలో జరిగిన దారుణ ఘటన
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన బాలిక
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం)
బాన్సువాడ, అక్టోబర్ 29: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని కాలునాయక్ తండాకు చెందిన చౌహన్ సరస్వతి (వయసు 10) బుధవారం ఉదయం పాముకాటుకు బలైంది.
సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం— పులిగుండు తండా పంచాయతీ పరిధిలోని కాలునాయక్ తండాకు చెందిన శ్రీకాంత్ కూతురు సరస్వతి ఉదయం వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు గమనించారు. ఈ సమయంలో ఆమె కుడికాలిపై పాముకాటు గుర్తులు కనిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యంలో దుర్కి వద్ద బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై తండ్రి చౌహన్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.