కడప కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు..!!

*షర్మిల టార్గెట్‌గా సుంకర పద్మశ్రీ సమావేశం.. అడ్డుకున్న నేతలు, తోపులాట!*

*కడప కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు*

*భేటీని అడ్డుకున్న షర్మిల వర్గీయులు*

*ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట*

*షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించారని పద్మశ్రీ విమర్శ*

*షర్మిల పనితీరుపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక*

*ప్యాకేజీ తీసుకునే షర్మిలపై పద్మశ్రీ విమర్శలంటూ షర్మిల వర్గం ఆరోపణ*

*పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి*

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల లక్ష్యంగా కడపలో నిర్వహించిన ఓ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఏర్పాటు చేసిన ఈ భేటీని షర్మిల వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కడపలోని ఐఎంఏ హాలులో నిన్న జరిగిందీ ఘటన.

వివరాల్లోకి వెళితే.. సుంకర పద్మశ్రీ ఆదివారం రెండు రోజుల పర్యటన నిమిత్తం కడపకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నిన్న ఆమె ఐఎంఏ హాలులో కొందరు కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ డీసీసీ అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్‌ అహమ్మద్‌ (ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు), ఎస్‌ఏ సత్తార్‌తో పాటు మరికొందరు అసమ్మతి నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం ఉద్దేశం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పనితీరుపై చర్చించడమేనని సమాచారం.

అయితే, ఈ సమావేశం గురించి తెలుసుకున్న షర్మిల మద్దతుదారులు డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి నాయకత్వంలో అక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇర్ఫాన్‌బాషా, అశోక్‌ రెడ్డి, ధ్రువకుమార్‌ రెడ్డి, శివమోహన్‌ రెడ్డి, మైనుద్దీన్‌ తదితరులు సుంకర పద్మశ్రీ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. “వైఎస్‌ షర్మిలారెడ్డి జిందాబాద్‌” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా పద్మశ్రీ వర్గం “రాహుల్‌ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. ఒకానొక దశలో నేతలు చొక్కాలు పట్టుకుని ఘర్షణకు దిగేంత వరకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సమావేశం అనంతరం సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల కేవలం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. షర్మిల పనితీరు సరిగా లేదని, ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని పద్మశ్రీ స్పష్టం చేశారు.

మరోవైపు, షర్మిలకు వ్యతిరేకంగా సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్‌లోని షర్మిల వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకర పద్మశ్రీ ఒక పథకం ప్రకారం ఎవరో ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని కడపకు వచ్చి షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని వారు తెలిపారు. ఈ ఘటన కడప జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment