CM Chandrababu : కేంద్రమంత్రికి మిర్చి కొనుగోలు పై లేఖ రాసిన సీఎం చంద్రబాబు
ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) లేఖ రాశారు. కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్లో ధరల పతనంపై ఈ నెల14 వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కూడా సమర్పించిందని వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం కింద మొత్తం వ్యయంను కేంద్రమే భరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.ఈ యేడాది మిర్చి విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా అధికంగా ఉందని తెలిపారు. గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాల్ 20 వేల రూపాయలు ఉండగా నేడు ఆ ధర 13 వేలకు పడిపోయిందని పేర్కొన్నారు. సాధారణ రకం మిర్చి క్వింటాల్కు 11 వేల రూపాయలకు పడిపోయిందని వివరించారు.
పలు దేశాలకు ఎగుమతి తగ్గడం వలన ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు. రైతులు ధరలు పడిపోవడం వలన తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారన్నారు. వెంటనే కేంద్ర మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం కింద కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు.