జాతీయ రహదారుల భూసేకరణకు సీఎం డెడ్లైన్
— నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్లకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
జాతీయ రహదారుల నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల కేటాయింపు, కోర్టు కేసుల పరిష్కారం వంటి ప్రక్రియలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ రామకృష్ణా రావు, ఆర్ అండ్ బి కార్యదర్శి వికాస్ రాజ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూముల వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని, టైటిల్ సమస్యలున్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
“రహదారి నిర్మాణం ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలి. రైతులు నష్టపోకుండా వెంటనే పరిహారం చెల్లించాలి. ఎలాంటి జాప్యం సహించము… అవసరమైతే చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ను ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, అటవీ అధికారి నికిత, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ రెవిన్యూ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.