79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ
జిల్లా కలెక్టర్ పిలుపు — పథకాల అమలులో అంకితభావం అవసరం
ప్రజాస్వామ్య పద్ధతిలో దేశం సాధించిన అభివృద్ధి గుర్తు
పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రస్తావన
పారదర్శకంగా గ్రామస్థాయి వరకు పథకాల ప్రయోజనం చేర్చాలని సూచన
వేడుకలో జిల్లా అధికారులు, సిబ్బంది హాజరు
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 15
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఐడీఓసీ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన కలెక్టర్, ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలితంగా దేశం 79 ఏళ్ల క్రితం స్వేచ్ఛ సాధించిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్పులు తెచ్చి, ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా భారత్ అభివృద్ధి సాధించిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పలు పథకాలు అమలు చేస్తున్నదని, వాటిని గ్రామస్థాయి వరకు పారదర్శకంగా, అంకితభావంతో అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలలో భోజనం, నాణ్యమైన వైద్య సేవలు వంటి పథకాల ప్రయోజనం ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.