కొత్తవలస ఆనకట్టను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

*కొత్తవలస ఆనకట్టను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలంలోని కొత్తవలస ఆనకట్టను ఆధునీకరించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ తదితరులు సీతానగరం మండలంలోని సువర్ణముఖి నదిపై దాదాపు బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆనకట్టను పరిశీలించారు. ఆనకట్ట పై రహదారి ఇరుకుగా ఉండటం, ఓవైపు పెద్దపెద్ద బండరాళ్లతో భయంకరమైన లోయ ఉండటంతో ప్రజలు భయం భయంగా ఆమె కట్టపై ప్రయాణాలు సాగిస్తున్నారన్నారు. రహదారిని వెడల్పు చేయాలన్నారు. అలాగే ప్రమాదవశాత్తు జారి ఇటువైపు లోయలో, నది నీటిలో పడిపోకుండా ఉండేందుకు ఇరువైపులా ప్రమాదాన్ని నివారించే గార్డ్ రెయిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. గార్డ్ రెయిల్స్ ఏర్పాటు చేస్తే ఆనకట్ట పై నడిచే పాదచారులు, వాహనాలు ఆనకట్ట అంచు నుండి పడిపోయే ప్రమాదాలు నివారించవచ్చు అన్నారు. వర్షాకాలం వస్తే ఈ ఆనకట్ట వద్ద ఏటా మృతదేహాలు లభ్యం కావడం సర్వసాధారణమైందన్నారు. ఈ ఆనకట్ట పైనుండి మక్కువ, సాలూరు, సీతానగరం, పార్వతీపురం తదితర మండలాలతో పాటు ఒడిశా కు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు కూడా రాకపోకలు సాగిస్తున్నారన్నారు. వర్షాకాలం వస్తే దాదాపు ఈ ఆనకట్టపై ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయన్నారు. భయం భయంగా గుండె గుప్పెట పట్టుకొని ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఏమాత్రం అడుగు జారినా, ఆదమరిచిన అదే ఆఖరని, అంతే సంగతులు అన్నారు. ప్రస్తుతం ఆనకట్ట గోడలు బీటలు వారాయన్నారు. గోడల్లో చెట్లు మొలవటంతో ఆనకట్ట పటుత్వం సన్నగిల్లిందన్నారు. షర్టుర్ల వద్ద చెట్లు, చెత్త ఇరుక్కు పోయిందన్నారు. ప్రస్తుతం ఆనకట్ట నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. 2016లో అప్పటి శాసనసభ్యులు బొబ్బిలి చిరంజీవులు, శాసన మండల సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్ తదితరుల ఆధ్వర్యంలో నీరు చెట్టు పథకంలో గేటు, షర్టర్లు పునర్నిర్మాణ పనులు చేపట్టారన్నారు. ప్రస్తుతం వాటికి మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీటలవారిన గోడలకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఆనకట్ట రహదారిని వెడల్పు చేసి, మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఆనకట్ట వద్ద వంతెన నిర్మాణం చేపడితే ఎక్కువ పొలాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. కాబట్టి కొత్తవలస ఆనకట్ట వద్ద వంతెన నిర్మాణం చేపట్టి భయానక ప్రయాణాలను, ప్రమాదాలను నివారించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment