మక్కువ మండలంలో రహదారులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

*మక్కువ మండలంలో రహదారులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 10( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని దొబ్బగెడ్డ – డి.శిర్లాం, కొత్తవలస – డి.శిర్లాం గ్రామాల రహదారుల నిర్మాణానికి మోక్షం ఎప్పుడని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ, ఆ పార్టీ ఓ బి సి పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, పార్వతీపురం మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు సాలూరు నియోజకవర్గం లోని, మక్కువ మండలం లో రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గోతులు ఏర్పడిన దొబ్బగెడ్డ – డి.శిర్లాం రహదారిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం వస్తే ఈ రహదారిలో ప్రయాణాలు కష్ట సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా లోవర కండి గ్రామ సమీపంలో నీటి ప్రవాహం అధికమే రోడ్డులో రాకపోకలు దాదాపు నిలిచిపోతాయన్నారు. తక్షణమే అక్కడ కల్వర్టు కట్టి రోడ్డు ఎత్తు చేసి వర్షా కాలానికి ముందే తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. ఈ రోడ్డు నిర్మాణం విషయంలో వైసిపి, కూటమి పాలకులు విఫలమయ్యారన్నారు. వారిచ్చిన ఎన్నికల హామీలు గాలిలో కలిసాయన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే శంబర, మామిడిపల్లి, తోణం, కురుకుట్టి, చెముడు తదితర గ్రామాలకు షార్ట్ కట్ రహదారి ఏర్పడి జిల్లా కేంద్రం దగ్గర అవుతుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు ప్రయాస పడకుండా జిల్లా కేంద్రానికి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చన్నారు. తక్షణమే రోడ్డు నిర్మాణానికి నియోజకవర్గానికి చెందిన మంత్రి చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పంచాయతీ సర్పంచ్ గేదెల కోటి నాయుడు ( వెంకట రమేష్ ) ను కలిసి రోడ్డు స్థితిగతులపై చర్చించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. రోడ్డు నిర్మాణం కోసం అందరూ సహకరించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తవలస – డి.శిర్లాం రోడ్డును పరిశీలించారు. ఆ రోడ్డు పరిస్థితి కూడా అంతే అన్నారు. కోట్లాది రూపాయలకు కాంట్రాక్టర్ కు కాంట్రాక్టు ఇచ్చి, సకాలంలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోతే కాంట్రాక్టర్ పై సంబంధిత పాలకులు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వర్షాకాలానికి ముందే ఆయా రోడ్డులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తమ నియోజకవర్గంలోని రోడ్డు నిర్మాణానికి గిరిజన శాఖ మంత్రి చొరవ చూపాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment