మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గత వారం రోజుల్లో 268 మంది వాహనదారులు పట్టుబడగా, 16 మందికి జైలు శిక్ష పడింది.
మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 19 నుంచి 25 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 268 మంది వాహనదారులు పట్టుబడ్డారని ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. 221 మంది టూ-వీలర్ డ్రైవర్లు, 37 మంది కార్ డ్రైవర్లు, 10 మంది ఆటో డ్రైవర్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డారు.
బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో పలువురిలో ఆల్కహాల్ మోతాదు తీవ్రస్థాయిలో నమోదైంది. 235 మందిలో 36 ఎంజీ నుంచి 200 ఎంజీ వరకు ఆల్కహాల్ శాతం గుర్తించగా, 8 మందిలో 301 ఎంజీ కంటే ఎక్కువ మోతాదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని కోర్టులో హాజరుపరిచారు.
కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బి.ఎన్.ఎస్)–2023 ప్రకారం, మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. మద్యం మత్తులో ప్రాణనష్టం కలిగిస్తే సెక్షన్ 105 కింద ‘హత్య కాని నేరపూరిత నరహత్య’ కేసు నమోదు చేసి, నేరం రుజువైతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
గత వారం నమోదైన కేసుల్లో 167 కేసులను కోర్టు విచారించింది. ఈ విచారణలో 16 మందికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. మరో 23 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించగా, 128 మందికి భారీ జరిమానాలు విధించారు. పోలీసులు ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.











