*హైదరాబాద్*
*బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (X) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు*
రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట వ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అన్నారు. వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా.. అని ప్రశ్నించారు.
గురువారం ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోందని కేటీఆర్ అన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలన్నారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఇంత భయమెందుకు.. అన్నదాతలపై ఇంతటి నిర్బంధమెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదని హెచ్చరించారు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో గురువారం చలో ప్రజాభవన్కు పిలుపిచ్చారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టినా.. రుణమాఫీ కాని రైతులు సోషల్మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్కు తరలిరావాలంటూ సోషల్మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ నెల 20న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులంతా తరలిరావాలని సోషల్మీడియా వేదికగా కోరారు. తమ పోరాటానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలన్నారు. రుణమాఫీ కాలేదనే బాధతో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.