సీఏఏ లబ్దిదారుల వివరాల్లేవ్‌..

సీఏఏ లబ్దిదారుల వివరాల్లేవ్‌..

IMG 20241013 WA0005

Details of CAA beneficiaries– కేంద్ర హోం శాఖ 2019వ సంవత్సరపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద భారతీయ పౌరులుగా మారిన దరఖాస్తుదారుల సమాచారం ప్రభుత్వం వద్ద సిద్ధంగా లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద ‘ది హిందూ’ పత్రిక అందించిన దరఖాస్తుకు హోం శాఖ స్పందిస్తూ తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే ఇస్తామని చెప్పింది. ఆర్‌టీఐ చట్టం ప్రకారం దరఖాస్తుదారుడికి సమాచారం అందించే పని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి (సీపీఐఓ)ది కాదని వివరించింది.

పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని? సీఏఏ కింద ఎంతమందికి పౌరసత్వం లభించింది? ఎన్ని దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి? అనే సమాచారాన్ని ‘ది హిందూ’ పత్రిక కోరింది. కాగా మరో ఆర్‌టీఐ దరఖాస్తుకు ఏప్రిల్‌ 15వ తేదీన హోం శాఖ స్పందిస్తూ సీఏఏ కింద వచ్చిన దరఖాస్తుల రికార్డును నిర్వహించాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మార్చి 11న కేంద్ర హోం శాఖ సీఏఏ నిబంధనలను నోటిఫై చేసింది.

సీఏఏను 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుండి ఎలాంటి పత్రాలు లేకుండా 2014 డిసెంబర్‌ 31వ తేదీకి ముందు మన దేశంలో ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు పౌరసత్వం కల్పించేందుకు సీఏఏను ఉద్దేశించారు. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హతగా నిర్ణయించిన 11 సంవత్సరాలను ఐదు సంవత్సరాలకు కుదించారు.

సీఏఏ కింద ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఈ చట్టం ద్వారా లక్షలు, కోట్ల మంది ప్రయోజనం పొందుతారని బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్‌ షా రాజ్యసభకు తెలిపారు. అయితే తక్షణం 31 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ ఓ పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. 25,447 మంది హిందువులు, 5,807 మంది సిక్కులు, 55 మంది క్రైస్తవులు, ఇద్దరు బౌద్ధులు, ఇద్దరు పార్శీలు…మొత్తం 31,313 మంది మైనారిటీలకు దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేయడం జరిగిందని, కాబట్టి వారు తక్షణమే ప్రయోజనం పొందుతారని ఐబీ అధికారిని ఉటంకిస్తూ పార్లమెంటరీ సంయుక్త కమిటీ తన నివేదికలో వివరించింది.

Join WhatsApp

Join Now